RBI/2016-17/115
DCM (Plg) No.1241/10.27.00/2016-17
నవంబర్ 09, 2016
ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
ప్రభుత్వ రంగ బ్యాంకులు/ప్రైవేట్ రంగ బ్యాంకులు/ విదేశీ బ్యాంకులు/
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు/పట్టణ సహకార బ్యాంకులు/
రాష్ట్ర సహకార బ్యాంకులు
డియర్ సర్,
ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 బ్యాంకు నోట్ల చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు
పైన పేర్కొన్న విషయానికి సంబంధించి మేము నవంబర్ 08, 2016న జారీ చేసిన సర్క్యులర్ నెం. DCM (Plg) No.1226/10.27.00/2016-17 ను చూడగలరు. ఏటీఎంలను తిరిగి ప్రజల వినియోగార్థం తెరచిన పిమ్మట ఆ ఏటీఎంలు స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల(SBN)ను పంపిణీ చేయడాన్ని అరికట్టడానికి, కేవలం రూ.100, రూ.50 నోట్లను మాత్రమే పంపిణీ చేయడానికి ఈ క్రింది చర్యలను తీసుకోవాలి:
I. నవంబర్ 11, 2016 నుండీ ఏటీఎంల పునరుద్ధరణ
ఏటిఎంలలోని నిర్దిష్టమైన క్యాసెట్ల నుంచి రద్దు చేయబడిన స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లు (SBN) విడుదల కాకుండా స్విచ్ లెవల్ లో (అవసరమైతే నిర్దేశిత అవుట్ సోర్సు/నిర్వాహణా సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా) అవసరమైన మార్పులు చేయాలి. ఇప్పటికే ఏటీఎంలలో ఉన్న SBNలను ఉపసంహరించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
II. ఏటీఎంలు 100 రూపాయలు, 50 రూపాయల నోట్లను విడుదల చేసేలా వాటిని రీకాలిబ్రేట్ చేయడం
బ్యాంకులు ఈ క్రింది విషయాలలో జాగ్రత్త వహించాలి (అవసరమైతే నిర్దేశిత అవుట్ సోర్సు/ నిర్వాహణా సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా)
a) ఏటీఎంలోని కనీసం ఒక క్యాసెట్ నుంచి అయినా రూ.100 నోట్లు విడుదలయ్యేలా వెంటనే వాటిని కాన్ఫిగర్ చేయాలి.
b) పై ప్రక్రియకు అవసరమైన, ఏటీఎంలలో ఇమిడిపోయే నోట్లను (కొత్త మరియు/లేదా రీసైకిల్ చేయదగిన నోట్లు) ఏజెన్సీలకు పంపిణీ చేయడం జరిగింది.
c) వీలైతే, ఏటీఎంల నుంచి SBN కాని బ్యాంకు నోట్లను విడుదల చేసేలా వాటిలో అదనపు క్యాసెట్లు అమర్చాలి.
III. నగదు ఉపసంహరణా పరిమితి రోజుకు ఒక కార్డుకు రూ.2000
బ్యాంకులు (జారీ చేసే బ్యాంకులు) ఈ క్రింది అంశాల కొరకు తమ కార్డు నిర్వహణా వ్యవస్థలో/కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేసుకోవాలి :
i) ఖాతాదారులందరూ ఏటీఎంలలో ఒక్కో కార్డుపై 2000 రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకోగలిగే విధంగా నగదు జారీని పరిమితం చేయాలి.
ii) అదే విధంగా నగదు ఉపసంహరణకు అవకాశం ఉన్న అన్ని విధానాలు, అనగా ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్ తో కలిపి, ఈ పరిమితి వారానికి 20,000 రూపాయలకు మించకూడదు. మరియు
iii) ఈ పరిమిత నగదు జారీలో మార్పులు/చేర్పులు జరిగినపుడు అవసరమైన మార్పులు చేయాలి.
iv. బ్యాంకు కరస్పాండెంట్ల ద్వారా నగదు ఉపసంహరణ
బ్యాంకు కరస్పాండెంట్లు బ్యాంకు ఏజెంట్లే కాబట్టి మైక్రో ఏటీఎంలు మరియు ఆధార్ అనుసంధానిత చెల్లింపు పద్దతి (AEPS) ద్వారా నగదు జమ చేయడం మరియు నగదు ఉపసంహరణ విషయాల్లో బ్యాంకులు వారికి తగిన సూచనలు జారీ చేయాలి. SBNల పంపిణీ, స్వీకరణ అప్పటికే ఉన్న సూచనలకు లోబడి ఉండేలా చూసుకోవాలి. అలాగే బ్యాంకు కౌంటర్లలో నగదు విత్ డ్రా చేసుకునే విషయంలోను వారికి తగిన సూచనలు జారీ చేయాలి (భారత ప్రభుత్వం నవంబర్ 8, 2016న విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో సూచించినట్లుగా)
v) క్యాష్ డిపాజిట్ మెషీన్లు మరియు క్యాష్ రీసైక్లర్ల ద్వారా డిపాజిట్ల స్వీకరణ
a) బ్యాంకులు ఈ క్రింది నిబంధనలను పాటించిన పిమ్మటే క్యాష్ డిపాజిట్ మెషీన్లు (CDMలు) మరియు క్యాష్ రీసైక్లర్ల(CRలు) ను ఏర్పాటు చేసుకోవచ్చు.
i) SBN నోట్లను స్వీకరించకుండా CDM లు మరియు CRలను నిర్వీర్యం చేయాలి.
ii) కార్డు ఆధారిత అథెంటికేషన్ (కార్డు లేకుండా డిపాజిట్ చేసే విధానాన్ని నిర్వీర్యం చేయాలి) ద్వారా SBNలను కార్డుహోల్డర్ ల అకౌంట్ లోకి సొమ్మును క్రెడిట్ చేసేలా (మరో రకంగా చెప్పాలంటే, థర్డ్ పార్టీ అకౌంట్లలోకి డిపాజిట్లను అంగీకరించరు) CDMలు మరియు CRలను కాన్ఫిగర్ చేయడం జరిగింది.
b) నిర్దేశిత CDMలు మరియు CRలు SBNలు కానటువంటి నగదు జమలు/చెల్లింపులను (ఏటీఎంలలో లావాదేవీల పరిమితులకు లోబడి) కొనసాగించవచ్చు.
vi. ఎక్కువ విలువ కలిగిన కొత్త సిరీస్ నోట్ల (రూ.500, రూ. 2000) పంపిణీ మరియు స్వీకరణకు సంసిద్ధత:
మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ లో ఎక్కువ విలువ కలిగిన రూ.500, రూ.2000 నోట్లు అందుబాటులోకి వచ్చి, వాటిని ద్రవ్య సరఫరాలోకి తీసుకువచ్చినపుడు బ్యాంకులు తమ ఏటీఎంలు మరియు CDM/CRలు చెల్లింపులు (విత్ డ్రా) చేయడానికి, స్వీకరించడానికి (డిపాజిట్) సిద్ధంగా ఉండేట్లు జాగ్రత్త వహించాలి.
2. పైన పేర్కొన్న సర్క్యులర్లోని 2(ii) మరియు 2(vi) అంశాలలో పొందుపరిచిన సూచనలు, మార్పులను అనుసరించి వైట్ లేబుల్ ఆపరేటర్లు వెనక్కి తీసుకుంటున్న (రీకాల్డ్) బ్యాంకునోట్లను డిపాజిట్ చేసే విషయంలో తమకు నగదు బట్వాడా చేసే బ్యాంకుల (ఒక వేళ అది స్పాన్సర్ బ్యాంకు అయినా, కాకపోయినా) చెంతకు వెళ్లవచ్చని బ్యాంకులకు సూచించడమైనది.
3. వినియోగదారుల సేవలను మెరుగుపరచడానికి ఈ క్రింది అదనపు ఏర్పాట్లను అమలు చేయడం జరుగుతోంది:
i) నగదు మార్పిడి, తత్సంబంధిత సేవల కొరకు అవసరమైతే బ్యాంకు కౌంటర్లను సాధారణం కన్నా ఎక్కువ పనిగంటల పాటు తెరిచి ఉంచాలి.
ii) నగదు మార్పిడి లావాదేవీల సేవలకుగాను ప్రజా సౌకర్యార్థం బ్యాంకులు ఒక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయాలి. హెల్ప్ లైన్ గురించిన సమాచారం బ్యాంకుల్లో బహిరంగంగా ప్రదర్శించడంతో పాటు, వెబ్ సైటులోనూ పొందుపరచాలి.
iii) ఒకో కార్డుపై రోజుకు రూ.2000 వరకు నగదు విత్డ్రాను పాయింట్ ఆఫ్ సేల్స్ టెర్మినల్స్ లోను అనుమతించవచ్చు. అయితే ఈ మొత్తం వారంలో అనుమతించిన నగదు పరిమితికి లోబడి ఉండాలి.
4. సమీక్ష అనంతరం, నవంబర్ 08, 2016న మేము జారీ చేసిన సర్క్యులర్లోని పేరా 3(iv) లో పేర్కొన్న విధంగా బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా మార్పిడి సౌకర్యం విషయంలో చేసిన సూచనలను వెనక్కి తీసుకోవడం జరిగింది.
5. ఈ సూచనలన్నీ తక్షణమే అమలు చేయాలి.
6. దయచేసి అందుకున్నట్లు సమాచారం ఇవ్వగలరు.
మీ విశ్వసనీయులు
(P. విజయ్ కుమార్)
చీఫ్ జనరల్ మేనేజర్ |