ఆగస్ట్ 19, 2015
11 చెల్లింపు బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ 'సూత్రప్రాయపు' అనుమతి మంజూరు
నవంబరు 27, 2014 తేదీన జారీ చేయబడ్డ 'చెల్లింపు బ్యాంకుల అనుమతికి మార్గదర్శకాలకు' (మార్గదర్శకాలు) అనుగుణంగా, ఈ క్రింద ఇవ్వబడ్డ 11 అభ్యర్థులకు, చెల్లింపు బ్యాంకులు ప్రారంభించడానికి 'సూత్రప్రాయంగా' అనుమతి మంజూరు చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు నిశ్చయించింది.
- ఆదిత్య బిర్లా నువో లిమిటెడ్
- ఎయిర్టెల్ ఎం కామర్స్ సర్విసెస్ లిమిటెడ్
- చోలమండలం డిస్ట్రిబ్యూషన్ సర్విసెస్ లిమిటెడ్
- డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్
- ఫినో పే టెక్ లిమిటెడ్
- నేషనల్ సెక్యూరిటీస్ డెపోజిటరీ లిమిటెడ్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
- శ్రీ దిలీప్ శాంతిలాల్ షాంఘ్వి
- శ్రీ విజయ్ శేఖర్ శర్మ
- టెక్ మహీంద్రా లిమిటెడ్
- వోడాఫొన్ ఎం-పేసా లిమిటెడ్
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక ఈ క్రింది విధంగా చేయబడింది:
ప్రథమంగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ అయిన డా. నచికేత్ మోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాహ్య సలహా సంఘం (External Advisory Committee [EAC]) ద్వారా, అభ్యర్థనలు నిశితంగా పరిశీలింప బడ్డాయి. ఈ సంఘం చేసిన సిఫారసుల ఆధారంగా, గవర్నర్, నలుగురు డెప్యూటీ గవర్నర్లు సభ్యులుగా గల అంతర్గత ఎంపిక సంఘం (Internal Screening Committee [ISC]) అభ్యర్థనలను తిరిగి స్వతంత్రంగా పరిశీలించి, సెంట్రల్ బోర్డ్ కమిటీకి (CCB) తుది జాబితాను సమర్పించింది. సెంట్రల్ బోర్డ్, ఆగస్ట్ 19, 2015 న జరిగిన సమావేశంలో ఈ అభ్యర్థనలను EAC, ISC లు సమర్పించిన సమాచారం ఆధారంగా పరీక్షించిన తరువాత, అనుమతించిన అభ్యర్థనల జాబితాను ఆమోదించి, ప్రకటించింది.
తుది జాబితాను ఖరారు చేసే సమయంలో, ఇప్పుడే మనుగడలోనికి వచ్చిన చెల్లింపు బ్యాంకులు ఏ రీతిలో కార్యకలాపాల్ని నిర్వహిస్తే విజయవంతమౌతాయో ప్రస్తుతం చెప్పడం చాలా కష్టమని బోర్డ్ అభిప్రాయపడింది. చెల్లింపు బ్యాంకులు, రుణాలు మంజూరు చేయవు గనుక, అన్నిసేవలు అందించే ఇతర బ్యాంకులకు ఉన్నంత నష్టభయం ఉండదని నమ్ముతున్నామన్నారు. అయితే, చెల్లింపు బ్యాంకులు పనిచేసే నియమిత పరిధిలో కూడా నష్టం సంభవించే అవకాశం ఉందా అన్నకోణంలో కూడా అభ్యర్థనలని CCB అంచనా వేసింది. వైవిధ్యమైన తరహాలో ఈ బ్యాంకుల్ని నడపాలన్నఉద్దేశంతో, విభిన్న రంగాల్లో అనుభవం, నైపుణ్యం గల సంస్థలనే ఎంపిక చేయడం జరిగింది. ఇంతేకాక, ఎంపికచేయబడ్డ సంస్థలు, దేశవ్యాప్తంగా ఇంతవరకు బ్యాంకింగ్ సేవలు అందని వినియోగదారుల్ని చేరుకోగల, ఆర్థిక సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం కలిగి ఉన్నాయని రూఢి చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ, ఈ 'సూత్రప్రాయపు' అనుమతులు, మార్గదర్శకాల్లో నిబంధన {(15 (V)} పై, ఇంకా తదుపరి కలిగే పరిణామాలపై కూడ ఆధారపడి ఉంటాయి.
ఈ అనుమతులు ఇవ్వడంలో సంపాదించిన అనుభవంతో, మునుముందు, ఈ అనుమతులు నిత్యమూ జారీ చేసే దిశగా, మార్గదర్శకాల్లో మార్పులు చేయడం జరగవచ్చు. ఈ సారి అనుమతి లభించని కొన్ని సంస్థలు భవిష్యత్తులో విజయం సాధిస్తాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ విశ్వాసం.
నేపథ్యం:
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆగస్ట్ 27, 2013 న తమ వెబ్ సైట్లో 'భారత దేశం లో బ్యాంకింగ్ వ్యవస్థ- పురోగమన దిశ' అన్న అంశం పై ఒక చర్చాపత్రాన్ని ప్రచురించింది. దీనిలో, ఇండియాలో నిర్దిష్ట రంగాలకు బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించాలనీ, ప్రత్యేకించి మౌలిక సదుపాయాలకై రుణాలకి, టోకు మరియు చిల్లర బ్యాకింగ్ రంగాలకు భిన్నమైన అనుమతి విధానం అవసరమని ఒక అభిప్రాయం ఇవ్వబడింది.
తదనంతరం, చిన్న వ్యాపారస్తులకు, అల్పాదాయ వర్గాలకు సమగ్ర ఆర్థిక సేవలపై ఏర్పరిచిన సంఘం (Committee on Comprehensive Financial Services for Small Business and Low Income Households) (అధ్యక్షులు: డా. నచికేత్ మోర్) దేశవ్యాప్తమైన చెల్లింపు యంత్రాంగానికి, సార్వజనికమైన పొదుపు సౌలభ్యానికి సంబంధించిన అంశాలను అధ్యయనంచేసి, ఇంతవరకు ఆర్థిక సేవలు లభ్యంకాని ప్రజల సౌకర్యంకోసం, చెల్లింపు బ్యాంకులకు అనుమతులు ఇవ్వాలని సూచించింది.
జులై 10, 2014 న సమర్పించిన 2014-2015 కేంద్ర బడ్జెట్లో గౌరవనీయులైన ఆర్థిక మంత్రి ఈ క్రింది ప్రకటన చేశారు:
"ప్రస్తుతం ఉన్న విధానాల్లో మార్పులు చేసిన అనంతరం, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగంలో సార్వజనిక బ్యాంకులకు నిరంతరంగా అనుమతులిచ్చే వ్యవస్థ ఏర్పాటు చేయబడుతుంది. ఈదిశగా, ఆర్ బి ఐ, చిన్న బ్యాంకులకు, ప్రత్యేక తరహా బ్యాంకులకు అనుమతులిచ్చే ప్రణాళికను రూపొందిస్తుంది. ఈ ప్రత్యేక తరహా బ్యాంకులు, స్థానిక బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు - చిన్న వ్యాపారస్తులకు, అసంఘటిత రంగ కార్మికులకు, అల్పాదాయ వర్గాలకు, రైతులకు, వలస కార్మికులకు రుణ సౌకర్యాలను మరియు సొమ్ము పంపే సౌలభ్యాలను అందించడానికి ఉద్దేశించబడ్డాయి"
ప్రజల అభిప్రాయంకోసం, మార్గదర్శకాల ముసాయిదా జులై 17, 2014 తేదీన విడుదల చేయబడింది. వచ్చిన వ్యాఖ్యలు, సలహాలు ఆధారంగా చెల్లింపు బ్యాంకుల అనుమతుల విధానంపై తుది మార్గదర్శకాలు, నవంబర్ 27, 2014 న జారీచేయబడ్డాయి. మార్గదర్శకాలపై వచ్చిన మొత్తం 144 ప్రశ్నలపై రిజర్వ్ బ్యాంక్, జనవరి 1, 2015 న వివరణలు ఇచ్చింది. చెల్లింపు బ్యాంకులకోసం 41 దరఖాస్తులు అందాయి.
'సూత్రప్రాయపు' అనుమతి వివరాలు
ఇవ్వబడిన 'సూత్రప్రాయపు' అనుమతి 18 నెలలు చెలామణీలో ఉంటుంది, ఈ వ్యవధి లోగా అభ్యర్థులు మార్గదర్శకాల్లో సూచించిన అన్ని షరతులు, భారతీయ రిజర్వ్ బ్యాంక్చే నిర్దేశించబడు ఇతర నిబంధనలు పాటించాలి.
'సూత్రప్రాయపు' అనుమతిలో భాగంగా నిర్దేశించబడిన షరతులను దరఖాస్తుదారులు పాటించారు అని తృప్తి చెందిన తరువాత భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 22(1) క్రింద బ్యాంకింగ్ కార్యకలాపాల్ని ఆరంభించడానికి అనుమతి జారీ చెసే విషయం పరిశీలిస్తుంది. అనుమతి జారీ చేసేవరకు, దరఖాస్తుదారులు ఏ విధమైన బ్యాంకింగ్ కార్య కలాపాలు చేపట్టరాదు.
మరికొన్ని వివరాలు:
కావలసిన అర్హతలు అసలున్నాయా లేదా అని మొట్టమొదట నిర్ణయించిన తరువాతే, అభ్యర్థనలని, ఇందుకోసం ఏర్పరచిన బాహ్య సలహా సంఘానికి (EAC) పంపాలని మార్గదర్శకాల్లో ఇవ్వబడింది. దరఖాస్తులు పరిశీలించడానికి, మార్గదర్శకాల్లో సూచించిన షరతులు పాటించేవారికి మాత్రమే అనుమతులు సిఫారసు చేయడానికి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ డా. నచికేత్ మోర్ (డైరెక్టర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ బోర్డ్) అధ్య క్షతలో, ఫిబ్రవరి 4, 2015 న ఒక EAC ని ఏర్పరచింది.
EAC లో ముగ్గురు సభ్యులు ఉండేవారు: శ్రీమతి రూపా కుడ్వ, మాజీ MD & CEO, CRISIL లిమిటెడ్; శ్రీమతి శుభలక్ష్మి, మాజీ CMD, అలహాబాద్ బ్యాంక్; డా. దీపక్ ఫాటక్, చైర్ ప్రొఫెసర్, IIT, ముంబయి. తరువాత శ్రీమతి రూపా కుడ్వ వైదొలగడంతొ, భారతీయ రిజర్వ్ బ్యాంక్, మే 2015 లో ICRA లిమిటెడ్ మానేజింగ్ డైరెక్టర్, గ్రూప్ CEO అయిన శ్రీ నరేష్ టక్కర్ ను ఆ స్థానంలో నియమించింది
మార్గదర్శకాల్లో నిర్దేశించిన విధంగా, EAC, దరఖాస్తులని పరిశీలించడానికి, వారివైన విధానాలని రూపొందించి, అవసరమైనచోట, మరి కొంత సమాచారాన్ని తెలుసుకోవడము కూడా పొందుపరచినారు. దరఖాస్తుదారుల ఆర్థిక స్వస్థత తెలుసుకోవడానికి, స్థాపకుల మరియు వారి ముఖ్య సంస్థల గత ఐదు ఏళ్ళ వ్యాపార సరళిని పరిశీలించారు. ప్రత్యేక నివేదికలు, వారు ఉద్దేశపూర్వకంగా పదేపదే చట్టాలని ఉల్లంఘించారా అన్న సమచారం ఆధారంగా, దరఖాస్తుదారుల యోగ్యతని, పాలనాదక్షతని అంచనావేసేటప్పుడు, ఈ క్రింది అంశాలు కూడా పరిశీలించబడ్డాయి: వారికి ఇప్పుడు ఉన్న ప్రత్యేక సామర్థ్యాలతో గ్రామాలకి చేరువయి, విశేష సేవలందించగలరా; సృజనాత్మకమైన వ్యాపార విధానాలతో, సాంకేతిక నైపుణ్యంతో అవసరమైన స్థాయిలో లావాదేవీలు జరపపగలరా; నగదు లావాదేవీలు విశ్వసనీయంగా, భద్రతతో నిర్వహించగలరా; ప్రతిపాదించిన వ్యాపార ప్రణాళిక, బ్యాంకింగ్ సేవల సరైన మేళవింపు కలిగి ఉందా, కావలసిన సాంకేతిక సదుపాయాలు కలిగి ఉందా, వ్యాపారాన్ని గ్రామాలకు చేరువ చేయగలరా; పాటించే విధానాలు ఆచరణీయమేనా, మొదలయినవి. గ్రామీణ ప్రాంతాలకు దగ్గరవడానికి, ఎక్కువ సంఖ్యలో, తక్కువ విలువ గల లావాదేవీలు జరపడానికి ఏ మాత్రం సామర్థ్యం ఉంది అన్న విషయం సులువుగా అంచనావేయడానికి దరఖాస్తుదారులనుంచి అదనంగా కొన్ని వివరాలు కోరడం జరిగింది. వీటిని పరిశీలించిన తరువాతే EAC తుది నిర్ణయాలు తీసుకుంది. EAC తమ నివేదికను జులై 06, 2015 తేదీన సమర్పించింది.
అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్చీఫ్జనరల్మానేజర్
పత్రికా ప్రకటన: 2015-2016/437 |